హైదరాబాద్ టు రాజస్థాన్.. ఐఆర్సిటిసి సరికొత్త టూర్ ప్యాకేజీ!
హైదరాబాద్ భాగ్యనగరం నుంచి రాజస్థాన్ ఎడారి విహారానికి వెళ్లాలని ఆశపడేవారు చాలామందే ఉంటారు. అలాంటి వారి కోరిక తీరనుంది. నేరుగా హైదరాబాద్ నుంచి రాజస్థాన్కు ఆరు రోజుల సరికొత్త టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది ఐఆర్సిటిసి. రాజస్థాన్ శీతాకాలపు అందాలను మనసారా ఆస్వాదించేందుకు ఈ టూర్ సరికొత్త ఎంపికనే చెప్పాలి. మరెందుకు ఆలస్యం ఆ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకుందామా..
పర్యాటక ప్రియులను ఆకర్షించడంలో ఇండియన్ రైల్వేస్కు చెందిన ఐఆర్సీటీసీ ఎప్పుడూ ముందుంటుంది. సీజన్కు అనుగుణంగా ఐఆర్సిటిసి అందించే ఆఫర్లు సరికొత్త విహారయాత్రల ప్రణాళికలనుకు తోడ్పడతాయి. అలాంటి ఐఆర్సిటిసి తాజాగా అదిరిపోయే టూర్ ప్యాకేజ్ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి రాజస్థాన్కు అందుబాటు ధరలోనే టూర్ ఆఫర్ చేస్తోంది.
రాజస్థాన్ శీతాకాలపు అందాలు చూసి రావాలని ఆశపడేవారికి ఈ టూర్ ఆఫర్ మర్చిపోలేని అనుభవాన్ని పరిచయం చేస్తుందనడంలో సందేహమే లేదు. ఐఆర్సీటీసీ గోల్డెన్ శాండ్స్ ఆఫర్ రాజస్థాన్ పేరుతో ఈ టూర్ను అందుబాటులో ఉంచింది. ఈ టూర్ ఐదు రాత్రులు/ ఆరు రోజులు ఉంటుంది.
చారిత్రక నిర్మాణాల నెలవు..
ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అందిస్తున్న ఈ టూర్లో భాగంగా జైసల్మీర్, జోధ్పూర్, మౌంట్ అబు, ఉదయ్పూర్ వంటి ప్రాంతాలు అన్నీ చుట్టేసి రావొచ్చు. అది కూడా విమానంలో వెళ్లి మళ్లీ విమానంలో రావొచ్చండోయ్. చారిత్రక నిర్మాణాల నెలవైన ఈ సుందర పర్యాటక ప్రదేశాలను ఒక్క టూర్ ప్యాక్లో చూడటం.. అది కూడా విమానం వెళ్లిరావడం అంటే.. ఊహించుకుంటేనే మనసు పులకరిస్తోంది కదూ!
అందరినీ దృష్టిలో ఉంచుకునే
టూర్ ప్యాకేజ్ ధరలు కూడా అందరినీ దృష్టిలో ఉంచుకుని నిర్ణయించినట్లే కనిపిస్తోంది. అధికారిక వివరాల ప్రకారం.. సింగిల్ అక్యుపెన్సీ అయితే రూ. 41,850, డబుల్ ఆక్యూపెన్సీ అయితే రూ. 32,750గా నిర్ణయించారు. అలాగే ట్రిపుల్ ఆక్యూపెన్సీ అయితే రూ. 31,700, చైల్డ్ విత్ బెడ్ (2 నుంచి 11 ఏళ్లు) అయితే రూ. 27,900 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే చౌల్డ్ విత్ ఔట్ బెడ్ అయితే రూ. 25,650 కట్టాలి. ఈ ప్యాకేజీలో భాగంగా విమాన టికెట్లు, ఐదు బ్రేక్ ఫాస్ట్లు, ఒక లంచ్, ఐదు డిన్నర్లు ఉచితంగానే ఉంటాయి. అంతేకాదు, సైట్ సీయింగ్ కోసం ఏసీ బస్ను కేటాయిస్తారు.
టికెట్ కొనుగోలుదారులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒక రోజు ఉదయ్ పూర్, ఒక రోజు మౌంట్ అబు, రెండు రోజులు జైసల్మీర్, ఒక రోజు జోద్ ఫూర్లో ఉండాల్సి ఉంటుంది. ఒక్క పూట మినహా లంచ్ ఖర్చు మరియు ఫ్లైట్లో మీల్స్కు ప్రయాణికులే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇరత ఖర్చులు టూరిస్ట్లే భరించాలి.
జర్నీ ఇలా సాగుతుంది..
తర్వాతి నెల అంటే, 2023 ఫిబ్రవరి 11న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. మొదటిరోజు హైదరాబాద్ నుంచి రాజస్థాన్ టూర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 11న హైదరాబాద్ నుంచి ఉదయ్ పూర్ వెళ్లాలి. మళ్లీ ఫిబ్రవరి 16న జోధ్ పూర్ నుంచి హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉంటుంది. కంఫర్ట్ క్లాస్లో ప్రయాణం ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకునేందుకు సమయం ఎక్కువగానే ఉంది కనుక కుటుంబసభ్యులతో టూర్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. వివానం ప్రయాణం చేసి, ఎడారి అందాలను చూసేందుకు ఇదే మంచి సమయం.